మిస్టరీ వీడిన యువతి హత్య
ప్రియుడే హంతకుడు
పెళ్లి చేసుకొమ్మని నిలదీసినందుకు చంపేశాడు
ధర్మవరం రూరల్: యువతి హత్య మిస్టరీ వీడింది. పెళ్లి చేసుకొమ్మని నిలదీయడంతో ప్రియుడే ఆమెను చంపేశాడు. నిందితుడిని ధర్మవరం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం సీఐ శివరాముడు, ఎస్ఐ గోపాలుడు మీడియాకు వెల్లడించారు. పుట్టపర్తికి చెందిన తుంగా సాయి జ్యోతి, ఆవుల రంజిత్కుమార్ ప్రేమించుకున్నారు. రంజిత్ కుమార్కు ఇదివరకే పెళ్లి అయి ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నానంటూ జ్యోతిని వెంట తిప్పుకునే వాడు.
బీటెక్ చదివిన జ్యోతి బ్యాంక్ పరీక్షల కోసం నంద్యాలలో కోచింగ్ తీసుకుంటోంది. ఈ నెల రెండో తేదీన నంద్యాల నుంచి ధర్మవరం వచ్చిన ఆమెను రైల్వే స్టేషన్ నుంచి రంజిత్కుమార్ తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని పుట్టపర్తి వైపు వెళ్లాడు. ధర్మవరం మండలం నిమ్మలకుంట సమీపంలోకి రాగానే తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి గట్టిగా నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని భావించిన రంజిత్కుమార్ బైక్ను వేగంగా నడిపి.. వెనుక కూర్చున్న జ్యోతిని కిందకు తోసేసి వెళ్లిపోయాడు. కింద పడిన జ్యోతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అనంతపురంలో మృతి చెందింది.
అరెస్టయ్యాడిలా..
ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ శివరాముడు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసును ఛేదించడానికి ఎస్ఐ గోపాలుడు, సిబ్బంది లాలూ ప్రసాద్, సురేష్, బయన్న, చక్రి, సాయి, దామోదర్లు ఒక బృందంగా ఏర్పడి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తుంపర్తి క్రాస్ వద్ద కాపు కాచి బుల్లెట్పై వస్తున్న రంజిత్ కుమార్ను అరెస్ట్ చేశారు. హత్య సమయంలో వాడిన బుల్లెట్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు.