మృత్యువుతో పోరాడి ఓడిన రాణి
సిద్దిపేటటౌన్ : గత నెల23 న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రియుడిని కాపాడబోయి విషప్రభావానికి గురైన బోనగిరి రాణి(28) అనే యువతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. వివరాల ప్రకారం..బెజ్జంకి మండలం రేగులపల్లికి చెందిన రాణి అదే గ్రామానికి చెందిన సంతోష్రెడ్డి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. కానీ రాణికి వేరే వ్యక్తితో వివాహాం జరిగింది.
వివాహం అయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుని ఇంటి వద్దనే ఉంది. ఈ క్రమంలో మళ్లీ వీరిద్దరు దగ్గరయ్యారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. రెండు కుటుంబాల సభ్యులు ప్రేమికులిద్దరిని వివాహం చేసుకుని హైదరాబాద్లో జీవించమని చెప్పి పంపించారు. ఊరిలో ఎల్లమ్మ పండగ నేపథ్యంలో గత నెల 23న రాత్రి ఇద్దరు సిద్దిపేటకు చేరుకున్నారు.
సిద్దిపేట కొత్త బస్టాండ్లో వీరు వేచి ఉన్న కొంత సేపటి తర్వాత ప్రియుడు సంతోష్రెడ్డి కూల్డ్రింక్లో విషం కలుపుకుని తాగాడు. గమనించిన రాణి అతన్ని కాపాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె సైతం విషప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.