చిన్నారిపై మృగాడి లైంగికదాడి

The young man who raped the girl - Sakshi

జయపురంలో ఆసిఫా తరహా ఘటన

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక

సందర్శించి వివరాలు తెలుసుకున్న  ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌ : మానుకోట జిల్లాలో ఆసిఫా ఉదంతాన్ని తలపించే దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలి బంధువులు,  స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ముక్కుడుదేవపల్లి  గ్రామం నుంచి ఓ కుటుంబం బతుకుదెరువు కోసం మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి నాలుగేళ్ల క్రితం వచ్చి స్థిరపడింది.

క్రేన్‌ల సాయంతో బావుల్లో బండలు, పూడిక తీస్తూ జీవించే ఆ దంపతులకు ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఎస్‌.కె మహబూబ్‌(21) జయపురం గ్రామంలోని తన బంధువైన ఆటో డ్రైవర్‌ యూసుఫ్‌ ఇంటికి చుట్టపు చూపుగా ఆదివారం వచ్చాడు. కాగా మధ్యాహ్నం  సమయంలో మూడేళ్ల బాలిక ఇంటి ఎదుట చింతచెట్టు కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఆమెను ఎత్తుకుపోయాడు.

బాలిక అన్న గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెతుక్కుంటూ వెళ్లేసరికి గ్రామ శివారులోగల ఓ కాల్వ కల్వర్ట్‌ వద్ద వారు కనిపించారు. అప్పటికే ఆ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారై బం«ధువుల ఇంటికి వెళ్లాడు. రక్తస్రావంతో ఉన్న చిన్నారిని గమనించిన బాధితురాలి తండ్రి వెంటనే నర్సింహులపేటలో ఓ ఆర్‌ఎంపీకి చూపించాడు. అయినా బాలిక ఏడుస్తుండగా మానుకోటలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు బాలికను చూడకుండానే కేసు నమోదు చేస్తేనే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడంతో అటువైపుగా వెళ్తున్న ఓ యువకుడు వారితో మాట్లాడి మహబూబాబాద్‌ టౌన్‌ ఎస్సై వద్దకు వారిని తీసుకెళ్లి విషయం తెలియజేశాడు.

వెంటనే ఎస్సై వారితో మాట్లాడి ఇద్దరు ఉమెన్‌ పీసీలను ఇచ్చి ఆ బాలికను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు ఆంగోత్‌ నరేష్‌కుమార్, బి. రాజారత్నం, నర్సిం హులపేట ఎస్సై బి. సంతోష్‌రావు ఆస్పత్రికి వచ్చి బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఫిర్యాదు స్వీకరించారు. మహబూబ్‌పై నిర్భయ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తొర్రూరు డీఎస్పీ బి. రాజారత్నం తెలిపారు. 

పోలీసుల అదుపులో నిందితుడు ?

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై నర్సింహులపేట ఎస్సై బి. సంతోష్‌రావును వివరణ కోరగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఇచ్చారని, కేసు నమోదు చేసి సంఘటనకు బాధ్యుడైన యువకుడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top