ప్రేమించలేదని బాలికను కిడ్నాప్‌ చేసి.. దారుణం

Young Man Killed Girl For Refusing His Love - Sakshi

చెన్నై: ప్రేమకు సమ్మతించలేదనే అక్కసుతో కిడ్నాప్‌ చేసి పాఠశాల విద్యార్ధినిపై ఘోరానికి తెగబడ్డారు. ఐదు రోజుల పాటు ఐదుగురు సామూహిక లైంగికదాడి జరిపి, హత్య చేసినట్లు గురువారం పోలీసుల వాగ్మూలంలో యువకుడు పేర్కొన్నాడు. వివరాలు.. పళ్లిపట్టు మండలంలోని కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన కార్మికుడు సుబ్రమణ్యం. ఇతని కుమార్తె సరిత(15) కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. సెప్టెంబర్‌ 7న ఇంటి నుంచి బడికి వెళ్లే మార్గంలో అదృశ్యమైంది. బిడ్డ కోసం తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు సాయంత్రం పొదటూరుపేట పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి పోలీసులు ఐదు నెలలుగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని వంకలో ముక్కలైన ఎముకలు, విద్యార్థిని యూనిఫాం, చెప్పులు గుర్తించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంక వద్దకు చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతి చెందింది విద్యార్థి అనే అనుమానంతో ఐదు నెలల కిందట అదృశ్యమైన విద్యార్ధిని తల్లిదండ్రులకు అక్కడికి రప్పించారు. విద్యార్థిని ధరించిన యూనిఫాం, చెప్పులను గుర్తించిన తల్లిదండ్రులు పేగుబంధం తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించారు.

నాలుగు బృందాల దర్యాప్తు
విద్యార్థిని మృతికి సంబంధించి జిల్లా ఎస్పీ పొన్ని ఆదేశాల మేరకు డీఎస్పీ శేఖ్‌ నేతృత్వంలో నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. మూడు రోజుల దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. కొత్త వెంకటాపురం గ్రామం మృతి చెందిన విద్యార్థిని సొంత మామ శంకరయ్య(21)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గగుర్పొడిచే నిజాలు వెల్లడయ్యాయి. టెన్త్‌ వరకు చదువుకున్న శంకరయ్య ఏడాదిగా సరితను ప్రేమిస్తున్నట్లు వెంబడించేవాడు. అయితే యువకుడి ప్రేమను విద్యార్దిని పట్టించుకోలేదని తెలిసింది. దీంతో శంకరయ్య అక్కసు పెంచుకున్నాడు. సంఘటన జరిగిన సెప్టెంబర్‌ 7న విద్యార్థిని బడికి వెళుతోంది.

అతను అక్కడికి వచ్చి ఆ విద్యార్థినితో మాట్లాడుతున్నాడు. హఠాత్తుగా బాలికను కిడ్నాప్‌ చేసి పక్కనే ఉన్న నాధముని రైతు పొలంలోని మోటారు షెడ్డులో బంధించారు. మరో నలుగురిని కలుపుకుని ఐదు రోజుల పాటు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేశారు. పంట పొలంలోని షెడ్డు వద్దనే మృతదేహాన్ని మట్టిలో పాతిపెట్టారు. విషయం బయటకు పొక్కనివ్వకుండా ఉండేందుకు రూ.ఐదు వేలు సైతం తీసుకున్నట్లు యువతి మామ వాగ్మూలంలో పేర్కొన్నాడు. సంఘటన జరిగిన రెండు నెలల తరువాత పంట దిగుబడికి రావడంతో ఎవరైనా గుర్తించే అవకాశం ఉందనే అనుమానంతో ఐదుగురం కలిసి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి వంకలో పాతిపెట్టినట్లు యువకుడు అంగీకరించాడు. ఆ యువకుడిని ఎస్పీ పొన్ని సమక్షంలో సామూహిక లైంగికదాడి జరిగిని ప్రాంతానికి తీసుకెళ్లి వివరాలు సేకరించారు. పరారైన నలుగురు కామంధుల కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top