ప్రశ్నించాడని.. యువకుడిపై అక్రమ కేసు
మంత్రి ఆదేశాలతో పోలీసుల ఓవరాక్షన్
జగన్పై జరిగిన హత్యాయత్నంపై సోషల్ మీడియాలోమంత్రులను ప్రశ్నించినందుకే..
పోలీసుల పద్ధతి సరైనది కాదు : వైఎస్ భాస్కర్రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : ఓ యువకుడు సోషల్ మీడియాలో ప్రశ్నించాడని అతనిపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. మంత్రి గారి ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం చూపారని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే...
సింహాద్రిపురం మండలం చెర్లోపల్లెకు చెందిన మహేష్బాబు ఇటీవల మంత్రులు ఆదినారాయణరెడ్డి, లోకేష్బాబులపై సోషల్మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం తానే చేయించుకున్నాడన్న మంత్రి ఆదినా రాయణరెడ్డి వ్యాఖ్యలపై మహేష్బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఆదినారాయణరెడ్డి దమ్ముంటే రాజీనామాచేసి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి స్వీకరించాలన్నాడు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి పదవి పొందిన విషయం విధితమే. అలాగే వార్డు మెంబరుగా కూడా గెలవని లోకేష్బాబుకు పంచాయతీరాజ్ మంత్రిని చే శారని మహేష్బాబు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో మహేష్బాబుపై పోలీసులు కేసు బనాయించారు.
పోలీసుల అత్యుత్సాహం
మహేష్బాబుపై కేసు నమోదు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియా ద్వారా అనేక మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. మహేష్బాబు విషయంలో మంత్రి అదేశాలతో పోలీసులు కేసు బనాయించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు పోలీసు అధికారి ఆదేశాల మేరకు సింహాద్రిపురం పోలీసులు యువకునిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అ«ధికార పార్టీ నాయకుల ఆదేశాలమేరకు యువకునిపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడం దారుణమని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
పోలీసుల పద్ధతి సరైనది కాదు
యువకునిపై కేసు నమోదు చేయడంలో పోలీసుల పద్ధతి సరైనది కాదని పులివెందుల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ సంజీవరెడ్డితో వాగ్వాదం చేశారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై అధికారపార్టీ నాయకులు అనేక దుర్భాషలాడుతున్నారన్నారు. వారిపై కేసు నమోదు చేయని పోలీసులు యువకునిపై కేసు ఎలా నమోదు చేస్తారన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లాంటివారు వైఎస్ కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డుగా పెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులు కృపాకర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం
ఈ విషయంపై సింహాద్రిపురం ఎస్ఐ సంజీవరెడ్డిని వివరణ కోరగా వై.కొత్తపల్లె ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మహేష్బాబుపై కేసు నమోదు చేశామన్నారు. సోషల్ మీడియా వేధికగా ఎవరిపై అయినా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.