ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
వివాహితను కత్తితో పొడిచి హత్య చేసిన ప్రియుడు
మైసూరు: వివాహేతర సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందనే కక్షతో ఓ వ్యక్తి వివాహితను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని మైసూరులోని హుణుసూరులో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని మారుతీ లేఅవుట్కు చెందిన జ్యోతి(29)కి కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంవత్సరం క్రితం అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే వివాహేతర సంబంధం కొనసాగించడం తనకు ఇష్టం లేదని జ్యోతి తేల్చి చెప్పింది. దీంతో ప్రవీణ్కు, ఆమెకు మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన ప్రవీణ్ శనివారం జ్యోతి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచాడు. హుణుసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు
ప్రవీణ్.. జ్యోతిని కత్తితో పొడిచిన అనంతరం బైపాస్రోడ్లోని ఓ లాడ్జ్పైకి ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ప్రవీణ్ తండ్రి అక్కడికి చేరుకొని అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు.