వివాహేతర సంబంధంతోనే హత్య

Women kills Husband over Extra marital affair in Kadapa - Sakshi

పులివెందుల : లింగాల మండలం ఎగువపల్లె గ్రామానికి చెందిన సాయిభూషణ్‌రెడ్డి ఈనెల 8వ తేదీన తన తోట వద్ద మృతి చెంది కనిపించాడు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టగా... హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు శుక్రవారం స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు తెలియజేశారు. 

సాయిభూషణ్‌రెడ్డికి అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెకు చెందిన శివలీలతో 17ఏళ్ల కిందట వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా శివలీల పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్ల గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్త సాయిభూషణ్‌రెడ్డిని అంతమొందించాలని వ్యూహం పన్నారు. అందులో భాగంగా ఈనెల 8వ తేదీన తన భర్త సాయిభూషణ్‌రెడ్డిని తోట వద్దకు పనుల నిమిత్తం వెళ్లమని పురమాయించింది. తోట వద్ద అప్పటికే శివలీల ప్రియుడు జనార్దన్‌రెడ్డి అతని స్నేహితుడు పులివెందులకు చెందిన మహేష్‌లు కాపు కాచి ఉన్నారు. నాగభూషణ్‌రెడ్డి తోట వద్దకు వెళ్లగానే జనార్దన్‌రెడ్డి టవాలుతో మెడకు బిగించగా.. మహేష్‌ కాళ్లు అదిమి పట్టుకుని హత్య చేశారు. తర్వాత ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నాగభూషణ్‌రెడ్డి మృతదేహం వద్ద విషపు గుళికలు ఉంచి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని కట్టుకథ అల్లారని తెలిపారు. తర్వాత అనుమానంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టగా.. అసలు విషయం బయటపడినట్లు ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రూరల్‌ సీఐ రామకృష్ణుడు, లింగాల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top