ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై..
సాక్షి, ఉత్తరప్రదేశ్: ఉత్తర ప్రదేశ్లో అత్యాచారాల పర్వ కొనసాగుతోంది. ముజఫర్నగర్లో 25 ఏళ్ల మహిళ, తన భర్త, మూడు నెలల బిడ్డతో కలిసి మోటర్ బైక్పై వెళ్తుండగా. . నలుగురు దుండగులు వారిపై దాడి చేసి.. మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రతి రోజు ఏదో చోట మహిళలపై అఘాయిత్యాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బల్లియ పట్టణంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ(20)పై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
స్థానికంగా నివాసముంటున్న మహిళ ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన విక్కి, భరత్ అనే ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. కేకలు వేయకుండా ఆమె నోట్లో గుడ్డలు పెట్టి బలాత్కారం చేశారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించి పరారయ్యారు. ఈ ఘటనపై ఈ రోజు ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.