పాము కాటుకు గురైన మహిళ మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు
మిరుదొడ్డి(దుబ్బాక) : పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాసులాబాద్లో జరిగింది. మిరుదొడ్డి ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పర్స కవిత (28) సోమవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద గొర్రెలను మేపడానికి వెళ్లింది.
గొర్రెలను కాస్తున్న క్రమంలో కుడికాలుపై నాగుపాము కాటు వేసింది. అక్కడే ఉన్న రైతులు గమనించి హుటాహుటిన సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మంగళవారం మృతురాలి తల్లి యాదవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అనాథలైన చిన్నారులు
పాము కాటుతో మృతి చెందిన కవితకు ఇద్దరు కుమారులు అజయ్, కుమార్ ఉన్నారు. మృతురాలి భర్త పర్శరాములు ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. తల్లి మృతితో చిన్నారుల రోదనలు ఆకాశాన్నంటాయి. చిన్నారు రోదనలకు గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.