న్యాయం జరగడం లేదని మహిళ ఆత్మహత్య
మరిపెడ : కూతురు ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ న్యాయం చేయలేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెçపూడి గ్రామం లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లకొండ మల్లయ్య, లక్ష్మి దంపతులు. వీరి కూతురు మమత హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో కుట్టుమిషన్ నేర్చుకుంటుండగా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన బంధువు ఉపేందర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
అతడు పెళ్లికి నిరాకరించగా మనస్తాపంతో ఈ ఏడాది జనవరిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయమై మరిపెడ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు విచారణ చేయకపోవడంలో నిర్లక్ష్యం వహించడంతో మనస్తాపం చెందిన లక్ష్మీ(45) ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట బంధువులు, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత సీఐ సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.