చెట్టుకు ఉరి వేసుకుని మహిళ మృతి

Women Commits Suicide in Krishna - Sakshi

పది రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసుల అంచనా

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ): గుర్తు తెలియని మహిళ జాతీయ రహదారి పక్కన చెట్టుకు చీరతో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కంచికచర్ల మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఏ మణికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పరిటాల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం సమీపంలో 65వ నెంబర్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకు గుర్తు తెలియని ఓ మహిళ వేలాడుతూ కనిపించిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా చెట్టుకు చెరతో ఉరేసుకుని వేలాడుతున్న మహిళ మృతదేహం ఉంది.

అక్కడి ఆనవాళ్లనుబట్టీ మహిళ పది రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉంటాయని, ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు ఉందని, గోధుమ రంగుపై వక్కపొడి డిజైన్‌ కలిగిన సిల్క్‌ చీర ధరించి ఉందని పంచనామాలో నమోదు చేశారు. అలాగే, ఆకుపచ్చ రంగు జాకెట్‌ రెండు చేతులకు ఎర్రని గాజులు, మెడలో ఎరుపు, తెలుపు రంగు కలిగిన పూసల దండ ఉంది. ఆమెను ఎవ్వరైనా హత్య చేశారా లేదా ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్నదానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని ఎస్‌ఐ తెలిపారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top