అప్పు తీసుకున్న వ్యక్తి అసభ్య ప్రవర్తన..

Women Commits Suicide in Hyderabad - Sakshi

గృహిణి ఆత్మహత్య

కేపీహెచ్‌బీకాలనీ: ఓ వ్యక్తి తీసుకున్న అప్పు తీర్చకపోగా తమ డబ్బులు అడిగినందుకు దాడికి పాల్పడ్డాడు. అంతేగాక అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యను అసభ్యకరంగా కించపరచడంతో సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామానికి చెందిన మేడికొండ పృధ్వీగణేష్‌(36) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు భార్య కృష్ణవేణి(31)తో కలిసి కేపీహెచ్‌బీకాలనీలోని ధర్మారెడ్డికాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు ఎనిమిది నెలల క్రితం జగ్గయ్యపేటకు చెందిన వేల్పుల సతీష్‌కు రూ.9 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఆ సమయంలో రెండు నెలల్లో తిరిగి ఇచ్చేలా అగ్రిమెంట్‌ కూడా రాసుకున్నారు.

అయితే, ఇచ్చిన గడువు పూర్తయ్యాక అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా గణేష్‌ పలుమార్లు సతీష్‌ను విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 9న సాయంత్రం సతీష్‌ ఫోన్‌ చేసి డబ్బులు ఇస్తానని ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. దీంతో భార్య కృష్ణవేణి, స్నేహితుడు బాలాజీలతో కలిసి గణేష్‌ సతీష్‌ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సతీష్‌ వారిపై అరుపులు, కేకలతో విరుచుకుపడ్డాడు. దీంతో వారు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. తిరిగి రాత్రి 8.30 గంటలకు సతీష్‌ కేపీహెచ్‌బీ కాలనీలో గణేష్‌ ఇంటికి వచ్చి గణేష్‌పై దాడికి దిగగా కృష్ణవేణి ఆపే ప్రయత్నం చేసింది. ఆమె పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ‘నా వద్ద నీకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, వాటిని బయటపెడతా’నని బెదిరిస్తూ సతీష్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్తానానికి గురైన కృష్ణవేణి సోమవారం తెల్లవారుజామున గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త గణేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top