ప్రేమ విఫలమై ఓ మహిళా పోలీసు..
చెన్నై : ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళా పోలీసు శనివారం ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తిరుచ్చి ఎడమలై పట్టి పుదూరు క్రాపట్టి పోలీసు క్వార్టర్స్లో రాజ్యలక్ష్మి (24) నివాసం ఉంటున్నారు. ఈమె తిరుచ్చి జిల్లా సాయుధ పోలీసు విభాగంలో పని చేస్తున్నారు. పెట్టవాయ్తలైకు చెందిన హోమ్గార్డ్ శివకుమార్ను గత కొంత కాలంగా రాజ్యలక్ష్మి ప్రేమిస్తున్నారు. అయితే వీరి వివాహానికి ఇరు వైపుల పెద్దలు ఒప్పుకోలేదు. ఇదే విషయమై శనివారం రాత్రి శివకుమార్, రాజ్యలక్ష్మి సెల్ఫోన్లో చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రాజ్యలక్ష్మి ఆగ్రహంతో కాల్ కట్ చేసింది.
ఆదివారం ఉదయం శివకుమార్ రాజ్యలక్ష్మికి ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన శివకుమార్ హూటాహుటిన క్రాపట్టి పోలీసు క్వార్టర్స్ చేరుకున్నాడు. అప్పటికే రాజ్యలక్ష్మి విషం తాగి అచేతనంగా పడిఉంది. దీంతో ఆమెను తిరుచ్చిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, రాజ్యలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం శివకుమార్ అక్కడి నుంచి ద్విచక్రవాహనంలో పెట్టవాయ్తలైకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ప్రమాదానికి గురైన అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని తిరుచ్చి ప్రభ్వుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.