మహిళ దారుణ హత్య
మరో ఇద్దరికి గాయాలు
ఒకరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
కర్ణాటక, బనశంకరి : వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళ దారుణహత్యకు గురైన ఘటన కొత్తనూరుపోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... కొత్తనూరు బైరతి నివాసి ఆనంద్ వైట్ఫీల్డ్ లోని హెచ్పీ గ్యాస్ కంపెనీలో బిజినెస్ అనాలసిస్ విభాగంలో ఉద్యోగి. 12 ఏళ్ల క్రితం స్నేహ అనే యువతితో ఆనంద్కు వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల కుమార్తె ఉంది. ఆనంద్ భార్య స్నేహ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా స్నేహ ఆటోడ్రైవరు భరత్తో పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన భర్త ఆనంద్ భార్యతో గొడవపడుతూ భరత్ సహవాసం విడిచిపెట్టాలని పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.
శనివారం రాత్రి ఇంట్లో దంపతుల మధ్య ఇదే విషయం గొడవ జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన స్నేహ, తన ప్రియుడు భరత్కు ఫోన్ చేసి పిలిపించింది. దీంతో గొడవ మరింత తీవ్రస్థాయికి చేరింది. భరత్తో పాటు అతని తండ్రి సన్నప్ప, తల్లి సావిత్రమ్మ కూడా వచ్చారు. వీరిని చూసిన ఆనంద్ కోపంతో ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. సావిత్రమ్మ కుమారుడికి మద్దతుగా నిలిచింది. దీంతో ఆవేశంతో ఆనంద్, భరత్ తల్లి సావిత్రమ్మ (43)పై కత్తితో దాడికి దిగాడు. అడ్డు వచ్చిన భరత్ను, అతని తండ్రి సన్నప్పను కూడా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినిన ఆస్పత్రికి తరలిస్తుండగా రొమ్ము భాగంలో గాయపడిన సావిత్రమ్మ మార్గం మధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ హురియప్ప సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆనంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.