గింజుపల్లిలో మహిళ హత్య
భర్తపైనే అనుమానం
గుంటూరు, గింజుపల్లి: మండల పరిధిలోని గింజుపల్లి గ్రామంలో మహిళ హత్యకు గురైన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే హతమార్చి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా హనుమాభాయ్ (45)కి, ఆమె భర్త శ్రీను నాయక్కు గత కొంత కాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం అర్ధరాత్రి వరకు ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హనుమాభాయ్ మృతదేహం గ్రామంలో నడిరోడ్డుపై పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. ఆమె మృతదేహాన్ని కొద్దిసేపటికి భర్త ఇంట్లోకి తీసుకెళ్లాడు. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అచ్చంపేట ఎస్ఐ పి.కిరణ్ ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.