కారు బీభత్సం మహిళకు గాయాలు
చైతన్యపురి: కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో ఓ మహిళ గాయపడిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మద్యాహ్నం నాగోల్ చౌరస్తా నుంచి కొత్తపేటవైపు వస్తున్న మారుతీ వాగనార్ కారు అదుపు తప్పి బండిపై పండ్లు అమ్ముకునే నాగలక్ష్మి అనే మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో బండి పూర్తిగా ధ్వంసమైంది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని డ్రైవర్ 108లో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.