పార్కు చేసి ఉన్న కారును ఢీకొట్టిన మహిళ
ముంబై: పార్కు చేసి ఉన్న టాటా ఇండికా కారును ఓ మహిళా డ్రైవర్ తన కారుతో పదే పదే ఢీకొట్టారు. దీంతో టాటా ఇండికా ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటన పుణెలోని రామనగరలో చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పింప్రి- చించావడ్ అడిషనల్ సీపీ తెలిపారు. తన కారును వెనక్కి తీసే క్రమంలో సదరు మహిళా డ్రైవర్ ఐదుసార్లు కారును ఢీకొట్టారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్కు చేసి ఉన్న కారు అద్దాలు ధ్వంసమైనా ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయిందని తెలిపారు.