రైలు నుంచి జారిపడి దుర్మరణం

Woman Dies After Falling Off From Train Maharashtra - Sakshi

ముంబై: కదులుతున్న రైలులో నుంచి పడి ఓ ఉద్యోగిని మరణించింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలిని చార్మీ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వివరాలు... నగరానికి చెందిన చార్మీ ప్రసాద్‌(22) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా విధుల నిమిత్తం లోకల్‌ సబ్‌అర్బన్‌ రైలు ఎక్కారు. ఈ క్రమంలో డోంబివలి, కోపార్‌ స్టేషన్ల మధ్యలో అకస్మాత్తుగా రైలు నుంచి జారి కిందపడిపోయారు. రైల్వే ట్రాక్‌పై యువతి పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన చార్మీని రైల్వే పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అప్పటికే చార్మీ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం గురించి డోంబివాలి పోలీసులు మాట్లాడుతూ చార్మీ ప్రసాద్‌ ఘాట్కాపూర్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇక ముంబై సబ్‌అర్బన్‌ నెట్‌వర్క్‌ మార్గంలో రోజుకు దాదాపు 8-10 మంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో, రైళ్లలో నుంచి జారి పడుతున్న ఘటనల్లో ఎంతో మంది వికలాంగులుగా మారుతున్నట్లు వెల్లడిస్తున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top