వివాహిత దారుణ హత్య

Woman Brutally Murdered In mylavaram - Sakshi

మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.. వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి.. క్షణికావేశం బంధాలకు దూరం చేస్తున్నాయి.. ఆవేశంలో చిన్నారుల ముందే దారుణాలకు పాల్పడుతున్నారు.. భర్త వివాహేతర సంబంధాని ప్రశ్నించడంతో వేధింపులకు గురిచేశారు.. చివరికి పక్కా ప్రణాళికతో దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనే దొనబండలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
సాక్షి, ఇబ్రహీంపట్నం(కృష్ణా) : మహిళను బంధువులే దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని దొనబండ బీసీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన గుంజా లక్ష్మమ్మ(28)ను అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. లారీ డ్రైవర్‌గా పనిచేసే ఏడుకొండలు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం ఆ మహిళతో హైదరాబాద్‌కు వెళ్లి వేరే కాపురం పెట్టాడు.

దీంతో న్యాయం చేయాలని లక్ష్మమ్మ పోలీసులను ఆశ్రయించింది. స్థానికులతో కలసి 65 నంబర్‌ జాతీయ రహదారిపై ధర్నాకు దిగింది. హైవేపై ధర్నా చేసినందుకు కొంతమంది గ్రామస్తులతో పాటు లక్ష్మమ్మపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు భర్త ఫోన్‌ నంబర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి అతడిని రప్పించారు. కోర్టులో కేసు నడుస్తోంది.

ఏడాదిగా భర్తతో పాటు అత్తామామలు ఆమెతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. బుధవారం కోర్టు వాయిదా ఉండడంతో వివాదం చోటుచేసుకుంది. ఎలాగైనా వదిలించుకోవాలకుని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మమ్మను అత్తామామలు గుంజా దుర్గ, ఆర్ముగం, బావ మునియప్ప కలసి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. 

తల్లిని చంపారంటూ..
తల్లి లక్ష్మమ్మను బంధువులు ఏ విధంగా చేసింది చిన్నకుమార్తె(6)  స్థానికులకు, బంధువులకు చెబుతోంది. హత్యచేసిన అనంతరం ముగ్గురు గ్రామం విడిచి పారిపోయారు. లారీ డ్రైవర్‌గా డ్యూటీలో ఉన్న భర్త ఏడుకొండలు ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి జరిగిన విషయాన్ని బంధువుల నుంచి సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top