పంటినొప్పి నెపంతో వచ్చి వైద్యురాలిపై దాడి
బంగారు గొలుసు లాక్కుని అదృశ్యం
సాక్షి, చిత్తూరు : పంటి నొప్పికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ వచ్చిన ఓ మాయలేడి దంపతులు దంతవైద్యురాలి నుంచి బంగారు గొలుసు లాక్కుని ఉడాయించారు. చిత్తూరులో మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఆ మాయలేడిని పట్టుకుని అన్ని నొప్పులకూ ట్రీట్మెంట్ ఇచ్చారు. బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసు అతిథి గృహంలో డీఎస్పీ ఈశ్వర్రెడ్డి సీఐలు భాస్కర్, రమేష్ మీడియాకు తెలిపిన వివరాలు..స్థానిక చర్చివీధిలో దంతవైద్యురాలిగా పనిచేస్తున్న ఎస్.పి.సుమతి వద్దకు మూడు నెలల క్రితం దంపతుల్లా ఇద్దరు వచ్చారు.
తాము పంటినొప్పితో బాధపడుతున్నామని, చికిత్స చేయాలని కోరారు. నిజమేనని నమ్మిన ఆ వైద్యురాలు వారితో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఆమెపై దాడిచేసి మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. దీంతో వైద్యురాలు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు రూరల్ మండలం లక్ష్మీపురానికి చెందిన గోవిందస్వామి, ఎం.సుగుణ (38) దంత వైద్యురాలి వద్ద బంగారు గొలుసు లాక్కుపోయినట్లు చర్చి వీధిలోని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఇక క్లూ లభించడంతో కేసును ఛేదించారు. సుగుణను అరెస్టు చేసి ఆమె నుంచి రూ.1.50 లక్షల విలువైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
వాస్తవానికి వీరిద్దరూ దంపతులు కాదని, గ్రామంలో పక్క పక్కనే ఇళ్లల్లో వీరు ఉంటున్నారని, వీరిద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ ఘటన తరువాత పశువులను చోరీ చేసిన కేసులో గోవిందస్వామిని చిత్తూరు తాలూక పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు గుర్తించారు. ఇతడిని త్వరలోనే పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకోనున్నట్లు డీఎస్పీ చెప్పారు. కాగా నిందితులను గుర్తించడంలో ఎస్ఐలు నెట్టికంఠయ్య, మనోహర్, చంద్రమౌళి, సిబ్బంది జయకుమార్, మురళి, రఘులను ఆయన అభినందించారు. త్వరలోనే వీరికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డును అందజేస్తామన్నారు.