నూర్జహాన్ హత్య కేసులో నిందితురాలు అరెస్టు
వైఎస్ఆర్ జిల్లా , వేంపల్లె : వేంపల్లె పట్టణం చైతన్యనగర్ వీధికి చెందిన షేక్ నూర్జహాన్(55) హత్యకేసులో నిందితురాలు అనసూయను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పులివెందుల రూరల్ సీఐ రామకృష్ణుడు తెలిపిన వివరాల మేరకు... పెండ్లిమర్రి మండలం సోగలపల్లెలో 26 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి చోరీకి గురైంది. ఈ కేసులో పెండ్లిమర్రి ఎస్ఐ రోషన్.. గండికోట అనసూయను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ క్రమంలో నూర్జహాన్ను దారుణంగా హత్య చేసి ఆమె వద్దనున్న కమ్మలు, ఉంగరం తీసుకున్నట్లు బయటపడింది. నూర్జహాన్, అనసూయల మధ్య కొద్ది రోజులుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో గత నెల 22న అర్ధరాత్రి నూర్జహాన్ ఇంట్లో అనసూయ నిద్రిస్తోంది. పొద్దుపోయాక నిందితురాలు బీరువా తాళాలు తీస్తుండగా చప్పుడుకావడంతో నూర్జహాన్ లేవడంతో వంటిట్లో ఉన్న కొడవలితో అనసూయ దాడి చేసింది. అప్పటికి ఆమె చనిపోవకపోవడంతో కత్తితో గొంతు కోసినట్లు నిందితురాలు తెలిపింది. రెండు కేసుల్లో నిందితురాలు అనసూయను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు