వివాహేతర సంబంధం; విషం తాగి..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కుట్రాలంలో ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు బుధవారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. నెల్లై జిల్లా పులియంకుడి కనకవినాయకర్ ఆలయ వీధికి చెందిన ఆనందగణేష్ (23)కు సుడలై అనే వ్యక్తితో బంధుత్వం ఉంది. దీంతో ఆనందగణేష్ తరచుగా వల్లింకులి ఇంద్రానగర్లో ఉన్న అతడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో సుడలై భార్య రేవతి (25)తో ఆనందగణేష్కు పరిచయం ఏర్పడింది. అది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఇటీవల వీరి వ్యవహారం బయటపడటంతో బంధువులంతా అనైతిక బంధాన్ని ఖండించారు.
ఈ క్రమంలో ఆనందగణేష్- రేవతి మంగళవారం ఇంటి నుంచి పారిపోయి కుట్రాలానికి వెళ్లారు. అక్కడ ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. ఊరికి తిరిగి వస్తే అవమానమని ఇద్దరు విషం తాగారు. కాగా బుధవారం సాయంత్రం వరకు వారు ఉన్న గది తలుపులు తెరచుకోకపోవడంతో సందేహించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి చూడగా గణేష్ మృతి చెంది ఉన్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రేవతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.