మహిళ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ
కత్తితో దాడి
వివాహేతర సంబంధమే కారణం
పొందూరు : వివాహేతర సంబంధం ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి ఆపై దాడికి దారితీసింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన స్థానిక ఖాదీ బాండారు వద్ద చోటుచేసుకొంది. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెలితే.. పొందూరులోని వాండ్రంగి వీధికి చెందిన మానెం శంకరరావు(బాబి) అనే వ్యక్తి స్థానిక ఖాదీ బాండారు సమీపంలో కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది కాలం వీరిద్దరి మధ్య ఈ సంబంధం నడిచింది. అయితే ఈ మహిళ ఇటీవల శంకరరావును విస్మరించి ముత్తికి మోహన్తో వివాహేతర సంబంధం పెట్టుకొంది.
దీంతో మానెం శంకరరావు, ముత్తికి మోహన్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ విషయంలో శుక్రవారం మధ్యాహ్నం ఖాదీ బాండారు వద్ద వీరిద్దరూ గొడవకు దిగారు. కొబ్బరికాయలు కొట్టేందుకు ఉపయోగించిన కత్తితో శంకరరావుపై మోహన్ దాడిచేసి గాయపరిచాడు. శంకరరావు తప్పించుకునే ప్రయత్నంలో చెవికింద భాగంలో, మెడ వద్ద తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ప్రజలు నిలువరించడంతో శంకరరావుకు ప్రాణాపాయం తప్పింది. వెంటనే పోలీసులకు, 108కు సమాచారం అందించారు. శ్రీకాకుళంలోని రిమ్స్లో శంకరరావు చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎస్ఐ బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ కోసం గాలింపు జరుపుతున్నామని ఎస్ఐ చెప్పారు.