తెల్లారిన బతుకులు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
మరో 9మందికి గాయాలు
ఆగిఉన్న వాహనాన్ని ఢీ కొన్న మరో వాహనం
అనంతపురం నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతుండగా ఘటన
కొండాపురం : కొండాపురం మండలంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అనంతపురం జిల్లా నుంచి వన్నూర్ బాషా తన కుమారుడి పుట్టువెంట్రుకలుతీయించేందుకు 11మందితో కలిసి నెల్లూరు దర్గాకు గురువారం తెల్లవారుజామున బయలు దేరారు. తాడిపత్రికి రాగానే వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం మొరాయించింది. దీంతో వన్నూరు బాషా తాడిపత్రిలో మరో టాటా ఏస్ బాడుగకు మాట్లాడుకుని బయల్దేరారు. ఆ వాహనం కొండాపురం మండలం పెంజి అనంతపురం కొత్త బైపాస్ సమీపానికి రాగానే పంక్చర్ అయింది. రోడ్డు పక్క ఆపి టైరు మార్చుతుండగా వెనుక నుంచి ఐషర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శింగనమలకు చెందిన షేక్ ఖాదర్ వల్లి (62) అక్కడికక్కడే మృతి చెందాడు. పది మంది గాయపడ్డారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో షేక్ అబ్దుల్ రషీద్(65) మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ హాజీవల్లి తెలిపారు. సంఘటానాస్థలాన్ని కొండాపురం సీఐ వెంకటరమణ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తెల్లవారుజామున కావడంతో వాహనం కనిపించక ఢీకొని ఉండొచ్చునని స్థానికులు చెప్పారు.