దూసుకొచ్చిన మృత్యువు
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్
ఇద్దరు కాపరులతోపాటు32 గొర్రెలు మృతి
భీమారం వద్ద ఘటన
సంఘటన స్థలాన్ని సందర్శించిన జైపూర్ ఏసీపీ
భీమారం(చెన్నూర్): రోడ్డు పక్క నుంచి వెళ్తున్న గొర్రెల మందపైకి అతివేగంగా దూసుకెళ్లిన ఇసుక టిప్పర్ ఇద్దరు మనుషుల ప్రాణాలతోపాటు 32 మూగజీవాలను బలిగొంది. ఈ ప్రమాదంలో గొర్రెలను తోల్కొని వెళ్తున్న కూలీ కాపరులు కొర్రెవార్ కిన్నులు (40) సంఘటన స్థలంలో మెదడు పగిలి చనిపోగా, మరో కూలీ కాడారి రాజలింగు (45) ఆస్పత్రిలో మరణించాడు. 32 గొర్రెలు కూడా చనిపోయాయి. మంచిర్యాల జిల్లా భీమారం సమీపంలోని ప్రభుత్వ కలప డిపో వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది.
శ్రీరాంపూర్ నుంచి చెన్నూరు వైపు ఇసుక కోసం వేగంగా వెళ్తున్న టిప్పర్ ముందున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో కొన్ని గొర్రెలు చెల్లాచెదురయ్యాయి. వాటితో ఉన్న కాపరి కిన్నులు తలపైనుంచి టిప్పర్ వెళ్లడంతో మొదడు బయ ట పడి అక్కడికక్కడే చనిపోయాడు. మరో కూ లీ రాజలింగుకు తీవ్ర గాయాలయ్యాయి. 32 గొ ర్రెలు కూడా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాయి. గాయపడిన రాజలింగును చె న్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చెన్నూరు మండలం దుగ్నెపల్లి చెందిన రమేశ్ తన 60 గొర్రెలను నెన్నెల మండలం ఆవడంలో ఉంచి అక్కడే కాపలా పెట్టాడు. వీటిని మేపడం తనతో కాదని తీసుకెళ్లాలని కాపరి చెప్పడంతో వాటిని దుగ్నెపల్లికి తీసుకొచ్చేందుకు రాజలింగు, చిన్నులు అనే కూలీలను పెట్టి మంగళవారం ఆవడం నుంచి దుగ్నెపల్లికి గొర్రెలు తీసుకొస్తున్నారు. అయితే భీమారం వచ్చే సరికి రాత్రి కావడంతో గొల్లవాగు ప్రాజెక్ట్ కాలువ వద్ద మందతో సహా బస చేశారు. తెల్లవారుజామునే లేచి గొర్రెలను రోడ్డుమార్గం గుండా తీసుకెళ్తున్నారు. బయల్దేరిన పది నిమిషాల్లోనే కూలీలు ప్రమాదానికి గురయ్యారు. జైపూర్ ఏసీపీ సీతారాములు, శ్రీరాంపూర్ సీఐ నారాయణ, ఎస్సై మంగీలాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ మేరకు డ్రైవర్ రాములుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మంగీలాల్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 32 గొర్రెలను వాహనంలో భీమారం పశుసంవర్ధకశాఖ వైద్యశాలకు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
కూలి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి..
కూలి కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొర్రెవార్ కిన్నులుది మహారాష్ట్రలోని చంద్రాపూర్. కడారి రాజలింగుది వేమనపల్లి మండలం బుయ్యారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న వారి బంధువులు చెన్నూరు ఆస్పత్రికి తరలివచ్చారు.
గతంలోనూ టిప్పర్లతో ప్రమాదాలు
మంచిర్యాల–చెన్నూరు రూట్లో గత కొద్ది నెలలుగా ఇసుక టిప్పర్లు, లారీలు పెద్ద మొత్తంలో తిరుగుతున్నాయి. అయితే అతివేగంగా వెళ్తుండడంతో ప్రజలు రోడ్డు పక్కనుంచి వెళ్లేందుకే భయపడుతున్నారు. గత వారం భీమారం బస్టాండ్ వద్ద వేగంగా వచ్చిన ఇసుక టిప్పరు ఆరెపల్లికి చెందిన వృద్ధురాలిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
చెన్నూర్/భీమారం: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.20 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరి చొప్పున ఉద్యోగం ఇవ్వాలని గొల్లకురుమ నవనిర్మాణ సమితి యువజన సంఘం అధ్యక్షుడు సిద్ది రమేశ్యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు సల్పాల సమ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందిన కిన్నులు, రాజలింగుల మృతదేహాలను సందర్శించి కు టుంబీకులను ఓదార్చారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజ మానితో మాట్లాడి తక్షణ సహాయంగా రూ.40 వేలు ఇప్పించామని సమ్మయ్య తెలిపారు. జిల్లా నాయకులు అల్లి రాజ మణి, గంట శ్రీహరి, జంగిళి గట్టయ్య, ఆవుల సురేశ్ ఉన్నారు.
సబ్సిడీ గొర్రెలుగాఅనుమానాలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు ప్రభుత్వం పంపిణీ చేసినవిగా అనుమానిస్తున్నారు. నెన్నెల, మందమర్రి ప్రాంతాల్లో దళారుల వద్ద కొనుగోలు చేసి వాటిని చెన్నూరు మండలం దుగ్నెపల్లికి తరలిస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. చెన్నూరు ప్రాంతా నికి చెందిన గొర్రెలు నెన్నెల మండలానికి మేత కోసం వెళ్లే అవకాశమే లేదని పలువురు అంటున్నారు. ఇదే విషయాన్ని సాక్షి వెటర్నరీ వైద్యుడు సతీశ్ను సంప్రదించగా మృతి చెందిన గొర్రెలు చెన్నూరు మండలానికి చెందినవి కాదని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
పెద్ద దిక్కు కోల్పోయారు
వేమనపల్లి(బెల్లంపల్లి): తల్లి బుచ్చక్క మూర్ఛవ్యాధి పీడితురాలు. కుటుం బా నికి పెద్ద దిక్కైన తండ్రి రాజలింగు భీ మారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కష్టాల కడలిలో ఉన్న ఆ సంసా రం రోడ్డున పడింది. కూలీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న రాయలింగు మృతితో వారి బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. నలుగురు ఆడ పిల్లలకు భ రోసా కరువైంది. గతేడాది క్రితమే పెద్ద కూతురు వివాహం అయింది. మిగతా ముగ్గురు ప ద్మ, గంగ, అశ్విని చిన్నపిల్లలు. కనీసం కూలీ పనులకు వెళ్లే పరిస్థితిలో కూడా వారు లేరు. తండ్రే దొరికిన కూలి పని కల్లా వెళ్లి భార్యా, పిల్లల్ని పోషించుకునేవాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి గొర్రెల వ్యాపారి రాగా మందకు కాపలా కోసమని వెళ్లాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకు న్న ఆమెకు 8 సార్లు మూర్చరోగం వచ్చి అపస్మారక స్థితిలో ఉంది. ఇద్దరు పిల్లలు తండ్రి కడసారి చూపు కోసం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలివెళ్లారు.