హత్య కేసులో నిందితుల అరెస్ట్
వేధింపులు తాళలేక హత్య
పోలీసుల అదుపులో వదిన, మరిది
వివరాలు వెల్లడించిన సీఐ
రామగుండం: రామగుండం పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయం ఎదుట ఆదివారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించిన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టుచూపారు. రామగుండం సీఐ సాగర్, ఎస్సై పసుల దత్తాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. రామగుండం పట్టణంలో నివాసముంటున్న ఎత్తరి మల్లేశ్(45)– సరిత దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వీరికి రెండు లారీలు ఉండగా తమ్ముడు విజయ్తో కలిసి మల్లేశ్ వాటిని నడిపిస్తున్నాడు. ఇద్దరిళ్లు పక్కపక్కనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మల్లేశ్ తరుచూ భార్య, పిల్లలనును వేధిస్తుండేవాడు. తన కూతురు ఓ వ్యక్తిని ప్రేమిస్తుందనే నెపంతో చేయి విరగొట్టాడు. ఇంటిపక్కనున్న తమ్ముడి కుటుంబంతోనూ గొడవ పడుతుండేవాడు.
ఒక క్రమంలో తాను తన తమ్ముడి భార్యతో సహజీవనం చేస్తానని, ఇందుకు తనకు రూ.5లక్షలు ఇస్తానంటూ సరితను దుర్బషలాడేవాడు. కొన్ని రోజుల క్రితం తన తల్లిని కొట్టాడు. ఈ క్రమంలో ఆదివారం తన భార్యను చంపేయాలని మల్లేశం పథకం పన్నాడు. అయితే లారీపై వెళ్లి అలిసిపోయి వచ్చి గాఢనిద్రలోకి జారుకున్నాడు. మల్లేశ్తో తనకు ప్రాణభయం ఉందని గ్రహించిన సరిత తనను చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు మరిది విజయ్కుమార్ సహకారం తీసుకుంది. అదే రోజు రాత్రి మల్లేశ్ నిద్రిస్తున్న సమయంలో కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. గొడ్డలితో తలపై మోదారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇద్దరూ పరారీ కాగా.. పో లీసులు మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదుతో నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు.