రైల్వేట్రాక్‌పై ఇద్దరు యువకులు దుర్మరణం  

Two Dies In Train Accident In Srikakulam - Sakshi

పొందూరు శ్రీకాకుళం : దూసి–జి.సిగడాం రైల్వే ట్రాక్‌పై వేర్వేరు చోట్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతి చెందారు. జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. దూసి–పొందూరు రైల్వే ట్రాక్‌పై తుంగపేట సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో చేతులు, కాళ్లు, తల, మొండెం వేర్వేరు చోట్ల తెగిపడ్డాయి. మృతుడి ఫ్యాంట్‌ జేబుపై సన్‌శ్రీ పీడీఆర్‌ అని టైలర్‌ మార్కు రాసి ఉంది. చేతికి వెండి కడియం, లవ్‌ సింబల్‌లో ఎస్‌ఎన్‌ అని రాసి ఉందని, ఆనవాళ్లు గుర్తించిన వారు 8919479058 నంబరుకు సంప్రదించాలని హెచ్‌సీ తెలిపారు. 

రైలు నుంచి జారిపడి..

పొందూరు–జి.సిగడాం రైల్వే ట్రాక్‌పై సిగడాం మండల పరిధిలో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడిన ఘటనలో జార్ఖండ్‌కు చెందిన సంతోష్‌ స్వైన్‌ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సంతోష్‌ ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన బావ సునీల్‌కుమార్‌ దాస్‌తో కలిసి రైలులో బయలుదేరాడు. చీపురుపల్లి రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత సంతోష్‌ కనిపించకపోవడంతో విజయనగరం రైల్వే స్టేషన్‌లో సునీల్‌కుమార్‌ దిగిపోయి పొందూరు చేరుకున్నాడు.

అక్కడి నుంచి ట్రాక్‌పై వెతుక్కుంటూ వస్తుండగా జి.సిగడాం పరిధిలోని ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. రెండు మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌ పోస్టుమార్టంకు తరలించామని హెచ్‌సీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top