ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ...
ఇద్దరు మహిళలు దుర్మరణం
డ్రైవర్, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
పూడూరు రంగారెడ్డి : ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ నుండి అంతారం వైపు వెళ్తున్న ఆటోలో ఎన్కేపల్లికి చెందిన జుబ్బురు కిష్టమ్మ(60), అంతారం గ్రామానికి చెందిన జుట్టు శ్యామమ్మ (50)లు వెళ్తుండగా హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మీర్జాపూర్ గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కిష్టమ్మ, శ్యామమ్మలు అక్కడికక్కడే మృతిచెందారు. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. జుబ్బురు కిష్టమ్మ తన కూతురు గ్రామమైన మీర్జాపూర్కు బయలు దేరింది.
రెండు నిమిషాల్లో ఆటో దిగుతుందనగా అంతలోనే మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చి కబలించింది. రోడ్డుపైనే ఇద్దరు మహిళలు కాళ్లు, చేతులు, నుజ్జునుజ్జయ్యాయి. ఈ మేరకు చన్గోముల్ ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆరా...
పూడూరు మండలం మీర్జాపూర్ గేటు వద్ద జరిగిన ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు.