రెప్పపాటులో ఘోరం
కరీంనగర్క్రైం : రెప్పపాటులో ఘోరం జరిగింది. కారు అతివేగం.. పాదచారి అజాగ్రత్త, రోడ్డు పక్కన నిలిపిన వాహనం వెరసి.. ఓ ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కరీంనగర్ శివారులోని హౌసింగ్బోర్డు కాలనీలో రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకోగా.. నిజామాబాద్కు చెందిన మాజిద్(26), వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన కజ్జూర్ ప్రశాంత్(24) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కరీంనగర్ పట్టణానికి చెందిన అరవింద్ తన మిత్రులతో కలిసి కరీంనగర్ శివారులోని మల్కాపూర్కు ఓ వివాహానికి హాజరు అయ్యాడు. అనంతరం మానేరు డ్యాం చూడడానికి కారులో వెళ్లాడు. తిరిగి గోదావరిఖని బైపాస్రోడ్డు గుండా.. తన నివాసం వైపు వెళ్తున్నాడు. ఈ సమయంలో కారును గమనించకుండా వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన కజ్జూర్ ప్రశాంత్ రోడ్డు దాటుతున్నాడు. అతడ్ని గమనించిన అరవింద్ తప్పించే క్రమంలో అదుపుతప్పి వేగంగా ఢీకొట్టాడు. దీంతో గాల్లోకి ఎగిరి కారుపై పడి ప్రశాంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అదే వేగంతో అప్పటికే రోడ్డు పక్కన తన బొలెరో వాహనంనకు గ్రీసు నింపుకుంటున్న నిజామాబాద్ జిల్లాకేం ద్రానికి చెందిన కూరగాయలు రవాణా చేసే మజిద్(26)ను ఢీకొట్టాడు. దీంతో అతనూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అనంతరం కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు తెలిపారు.