భారీ వర్షాలు.. ఘోర రైలు ప్రమాదం
టెకిర్దాగ్: టర్కీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈశాన్య ప్రొవిన్స్ టెకిర్దాగ్లో ఆదివారం సాయంత్రం ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పటంతో పలువురు మృతి చెందారు. ఐదు భోగీలు బోల్తాపడటంతో అందులోని ప్రయాణికులు చెల్లాచెదురు అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 10 మంది మృతి చెందారని, 70 మందికి పైగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.
రైలు ఎడ్రిన్ నుంచి ఇస్తాంబుల్కు వెళ్తుండగా సరిలర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వంతెన కింది మట్టి కొట్టుకుపోవటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. రైల్లో సుమారు 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 100 ఆంబులెన్స్లు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంపై టర్కీ అధ్యక్షుడు, స్థానిక గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.