రక్తమోడిన రహదారులు..

Three Persons Died In Road Accident Warangal - Sakshi

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వేరు వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దుర్గామాతను దర్శించుకునేందుకు వస్తూ ఒకరు, లారీ ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు.  

జనగామ: దుర్గామాతను దర్శించుకునేందుకు కారులో హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘంటన జనగామ మండలం పెంబర్తి బైపాస్‌ వద్ద ఆదివారం జరిగింది. డీసీఎం, షిఫ్టుకారు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఓ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం..హైదరాబాద్‌ వనస్థలిపురంలో నివాసం ఉంటున్న ఇండస్ట్రీయల్‌ వ్యాపారి నాగిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆయన భార్య మంజుల, కుమారుడు రేవంత్‌రెడ్డి(12) తమ షిఫ్టుకారులో జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని అత్త గారింటికి బయలుదేరారు. గ్రామంలో వరుసగా రెండో ఏటా దుర్గామాత జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి.

చివరి రోజు అమ్మవారిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకునేందుకు సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులు బయలుదేరి వస్తున్నారు.  మరో 30 నిమిషాల్లో దేవరుప్పులకు చేరు కునేలోపే జెర్సీ పాల కంపెనీకి చెందిన డీసీఎం ఎదురుగా వచ్చి కారును ఢీ కొట్టింది.  కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో సుధీర్‌రెడ్డికి గాయాలయ్యాయి. కుమారుడు రేవంత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మంజుల, డ్రైవర్‌ బ్రహ్మచారి పరిస్థితి విషమంగా మారింది. సంఘటన జరిగిన క్రమంలో అక్కడే ఉన్న పలువురు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మచారి, మంజుల పరిస్థితి విషమంగా మారగా, సుధీర్‌ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్సలు చేసిన అనంతరం వారిని హైదరాబాద్‌కు తరలించారు.

బిడ్డ..మనువడు..అల్లుడి కోసంఎదురు చూపు
దుర్గమ్మ జాతర చివరి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న కూతురు, మనువడు, అల్లుడి రాక కోసం దేవరుప్పులో బంధువులు ఎదురు చూస్తున్న సమయంలో..చేదు వార్త విని కుప్పకూలి పోయారు.  జనగామ జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే అల్లుడు,  కూతురును హైదరాబాద్‌కు తరలించగా.. మనువడి మృతదేహం చూసి.. గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టారు.  

నా కొడుకు ఎక్కడ...
రోడ్డు ప్రమాదంలో రేవంత్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా.. తండ్రికి తెలియకుండా..జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచారు. చివరి శ్వాస ఉందనే ఉద్ధేశ్యంతో.. వైద్యులు ఈసీజీ తదితర పరీక్షలు చేసి రేవంత్‌రెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు.  మూడు చోట్ల కాలు విరిగి పోయి అవస్థలు పడుతున్న మంజుల.. చేయి విరిగి శరీర భాగాలకు తీవ్ర గాయాలై నొప్పితో ఇబ్బంది పెడుతున్నా  కొడుకు రేవంత్‌ ఎక్కడ.. అంటూ తండ్రి అక్కడ ఉన్న వారిని అడుగుతుంటే కన్నీళ్ల పర్యంతమయ్యారు. మీ కుమారుడు బాగానే ఉన్నాడు.. అధైర్య పడకండి అంటూ ఓదార్చారు.  విషమ పరిస్థితిలో డ్రైవర్, మరో పక్క భార్య అవస్థలు.. కనిపించని కుమారుడితో సుధీర్‌రెడ్డి కుమిలి పోయాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top