ప్రయాణికుల ఆర్తనాదాలు.. మృత్యు పంజా..!
సెయ్యారులో రెండు బస్సులు ఢీ
ముగ్గురి మృతి, 35 మందికి గాయాలు
సాక్షి, తిరువణ్ణామలై: సెయ్యారు సమీపంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, 35 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. వేలూరు నుంచి బుధవారం ఉదయం ప్రభుత్వ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సును డ్రైవర్ మది అయగన్ నడుపుతున్నాడు. ఉదయం 10గంటల సమయంలో బస్సు సెయ్యారు–వందవాసి రోడ్డులోని ఎంజూరు గ్రామం మలుపు వద్ద తిరుగుతున్న సమయంలో ఎదురుగా వందవాసి నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు అతి వేగంగా ఢీకొంది.
ప్రమాదంలో బస్సులు ధ్వసం కావడంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో భయానక పరిస్థితి ఏర్పడింది. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వందవాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే మార్గం మధ్యలోనే సెయ్యారు సమీపంలోని పయంగెనరు గ్రామానికి చెందిన దామోదరన్(70), మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు మృతి చెందారు. 35 మంది క్షతగాత్రులు వందవాసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనగానూర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి ప్రమాదంపై విచారణ చేపట్టారు.