పసిమొగ్గపై కామాంధుల పంజా
మూడేళ్లుగా ముగ్గురి అత్యాచారం
కోలారు జిల్లా మాలూరులో దారుణం
ఎట్టకేలకు మృగాళ్ల అరెస్టు
కర్ణాటక ,మాలూరు: బాలికపై పలు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ముగ్గురు కామాంధులను మాలూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. పట్టణంలోని ధర్మరాయ స్వామి దేవాలయ రోడ్డు నివాసి పెరుమాళ్ (37), దొడ్డకడతూరు గ్రామ నివాసి శ్రీనివాస్ (38), ద్యాపసంద్ర గ్రామ నివాసి వి.రాము (40)లు నిందితులు. అంబేడ్కర్ కాలనీలో ఉన్న మైనర్ బాలికపై ఈ ముగ్గురు గత కొద్ది సంవత్సరాలుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. వారి పీడ తట్టుకోలేక బాలికతల్లికి చెప్పగా, వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కామాంధుల వికృత క్రీడ గుట్టు రట్టయింది. బాలిక పట్టణంలోని హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. బాలిక 5వ తరగతి చదువుతున్న సమయంలో ధర్మరాయ స్వామి దేవాలయ రోడ్డులో బట్టల దుకాణంలో పనిచేస్తున్న పెరుమాళ్ తన ఇంటికి పిలుచుకు వెళ్లి అత్యాచారం చేసి డబ్బులు, తినుబండారాలు ఇచ్చేవాడు.
స్నేహితులైన ఫ్లోర్మిల్లో పనిచేసే దొడ్డకడతూరు శ్రీనివాస్, టైలర్ రాముతో కలిసి బాలిక మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ నెల 5వ తేదీన కూడా వీరు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా విషయం తెలిపితే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై బాలిక తల్లి ఈ నెల 9వ తేదీన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మంగళవారం ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. బాలికకు ఎస్ఎన్ఆర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి స్త్రీ శిశు సంక్షే శాఖ రక్షణా కేంద్రానికి అప్పగించారు.
విందులో అత్యాచారం :నిందితుడు అరెస్టు
కృష్ణరాజపురం: స్నేహితుడి ఆహ్వానం మేరకు పుట్టినరోజు పార్టీలో పాల్గొనడానికి వెళ్లిన యువతిపై యువకుని స్నేహితుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన దొడ్డనెక్కుందిలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి (24) బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో దొడ్డనెక్కుందికి చెందిన అరీఫ్ అనే యువకునితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అరీఫ్ కూడా ఎంబీఏ చదివేవాడు కావడంతో స్నేహం బలపడింది. 9వ తేదీ పుట్టినరోజు కావడంతో అరీఫ్ పార్టీకి యువతిని కూడా ఆహ్వానించాడు. అందుకు అంగీకరించిన యువతి అరీఫ్ గదికి వెళ్లగా గదిలో తన పాటు ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఆదిత్యను అరీఫ్ యువతికి పరిచయం చేశాడు. ముగ్గురు మద్యం సేవించారు. అరీఫ్ భోజనాలు తేవడానికి బయటకు వెళ్లగా విశ్రాంతి తీసుకోవడానికి యువతి పక్కగదిలో వెళ్లింది. ఇదే అదనుగా ఆదిత్య యువతిని లైంగికంగా వేధించసాగాడు. యువతి మద్యం మత్తులో ఉండడంతో ప్రతిఘటించలేకపోయింది, ఆదిత్య ఆమెపై అత్యాచారం చేశాడు. కొంతసేపటికి తిరిగివచ్చిన అరీఫ్తో ఆమె విషయాన్ని తెలపగా మరుసటి రోజు హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిత్యను అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు