ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హతమార్చారు. కత్తులతో అతి కిరాతంగా పొడిచి చంపేశారు. దుండగుల దాడిలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతడి తల్లిదండ్రులు, సోదరి చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరిని చంపేయడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్కు చెందిన కాంట్రాక్టర్ మిథిలేశ్ ఆయన భార్య సియా, కూతురు, కుమారుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్లోని కిషన్గఢ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. బుధవారం ఉదయం కొందరు దుండగులు వారింట్లోకి ప్రవేశించి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. మిథిలేశ్తోపాటు అతని భార్య, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. హత్యలకు గల కారణాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇంట్లోని లాకర్ నుంచి ఎలాంటి వస్తువులు పోలేదని, దుండగులు వంటగదిలో ఉన్న కత్తితో దాడి చేసి వారిని చంపేశారని డిప్యూటీ కమిషనర్ మేరీ జైకర్ తెలిపారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మీడియాకు తెలిపారు. దుండగులు చోరీ ప్రయత్నంలో భాగంగా హత్యలకు పాల్పడ్డారా లేక వ్యాపార తగాదాలా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆరునెలల క్రితం కొందరు డబ్బు కోసం మిథిలేష్ కొడుకును కిడ్నాప్ చేశారని సియా సోదరుడు పోలీసులకు తెలిపారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న మిథిలేశ్ కుమారుడు ఇచ్చే ప్రాథమిక సమాచారం కీలకం కానుందని పోలీసులు వివరించారు.