ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వేగంగా దూసుకెళుతున్న కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గురువారం ఉదయం నిజామాబాద్లోని సదాశివ నగర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం హైదరాబాద్లోని వనస్థలీపురం హైకోర్టు కాలనీకి చెందిన ఐదుగురు అక్షరాభ్యాసం కోసం కారులో బాసరకు బయలుదేరారు. 44వ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం వద్దకు రాగానే ఓ లారీని ఢీకొట్టింది. కారు కుడి భాగం లారీని బలంగా ఢీకొనటంతో కారు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీకొట్టటంతో లారీ సైలెన్సర్ పేలి మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధం అయింది.