అర్చకుడే దొంగగా మారాడు
అమ్మవారి చీరలు చోరీ చేసిన అర్చకుడు, సహాయకుడు
నిందితుల అరెస్ట్
రాంగోపాల్పేట్: దేవాలయంలో పనిచేసే అర్చకుడే దొంగగా మారి అమ్మవారి చీరలను చోరీ చేశాడు. భక్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ప్రధాన అర్చకుడితో పాటు అతని సహాయకుడు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్బజార్లోని సంతోషీమాత దేవాలయంలో భాస్కరబట్ల రామశర్మ ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సహాయకుడిగా బాబురావు పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి అమ్మవారికి వచ్చే చీరలు, బియ్యం కొన్ని వస్తువులు దేవాలయంలో అప్పగించకుండా ప్రధాన అర్చకులు తీసుకుని వెళుతుండటం భక్తులు, మాజీ ధర్మకర్తలు గమనించారు. ఇదే విధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన 42 చీరలు దేవాలయంలో ఉండగా వాటిని తన ఇంటికి తీసుకుని భాస్కరబట్ల రామశర్మ బాబూరావుకు సూచించాడు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో బాబూరావు ఈ చీరలను తీసుకుని రామశర్మ ఇంటికి యలుదేరాడు. గమంచిన మాజీ చైర్మన్ రాయి వెంకటేష్, ధర్మకర్త రామ్మోహన్లు అతని వాహనాన్ని ఆపి తనికీ చేయగా చీరెలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈఓ విఠలయ్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదుచేసి శనివారం ఇద్దరినీ అరెస్టుచేశారు.