తేజస్విని బిడ్డ కూడా మృతి
గురువారం వెలుగు చూసిన ఘటన
తేజస్విని మృతిపై నిరసనల వెల్లువ
ఆమె మృతికి కారణమైనవారిని అరెస్ట్ చేయాలని కరవే ధర్నా
గంగావతి రూరల్: శ్రీరామనగర్లో బుధవారం అత్తింటి ఆరళ్లకు బలైన తేజస్విని మృతి ఘటనలో మరో ఉదంతం వెలుగు చూసింది. ఆమె 11నెలల కుమార్తె కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెలుగు చూసింది. ఘటనలో చిన్నారి మృతి చెందగా ఆ నేరం తనపై పడుతుందని భావించిన తేజస్విణి భర్త కిరణ్ కుమార్ పాపకు ఆరోగ్యం బాగా లేదని చెబుతూ కారులో గంగావతి ఆస్పత్రికి తరలించాడు. అయితే బాలిక మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అనంతరం గంగావతికి వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తేజస్విణితోపాటు బాలిక కూడా మృతి చెందినట్లు తెలయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తేజస్విని భర్త, అత్త, మామలను అరెస్ట్ చేయాలని కరవే ఉద్యమించింది.
గురువారం పెద్ద సంఖ్యలో కరవే కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని టైర్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు. మృతురాలి బంధువులు మాట్లాడుతూ తేజస్విణి మగబిడ్డకు జన్మ ఇవ్వలేదని నిత్యం ఆమెను మానసికంగా హింసించేవారని ఆరోపించారు. తేజస్విని భర్త కిరణ్కుమార్ మొదటి భార్యను కూడా ఇలాగే హింసించడంతో ఆమె భర్తను వదలి వెళ్లిందని గుర్తు చేశారు. తేజస్వినిని ఆమె భర్త, అత్త, మామలు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తేజస్వినిణిని హత్య చేసి కోళ్లు కాల్చే గ్యాస్స్టౌత్తో శరీరంపై కాల్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. తేజస్విని భర్త కిరణకుమార్, మామ సైకిల్ నాగేశ్వరరావు,అత్త నాగలక్ష్మిలను కఠినంగా శిక్షించాలని కరవే యువ జిల్లా కార్యదర్శి లక్ష్మణ డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో నాయకులు జయకరణ, గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్, కర్ణాటక జనకల్యాణ వేదికే అధ్యక్షులు దేవప్ప ఎస్ మేనసగి, శ్రీరామనగర్ గ్రమపంచాయితీ అధ్యక్షలు కరుటురి శ్రీనివాస్, దళిత నాయకులు బసవరాజ్,శ్రీరామనగర సభ్యలు రవి పాల్గొన్నారు.
కన్నీరు మున్నీరైన తేజస్విని తల్లిదండ్రులు
ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేస్తే తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పేంటుపాడ్యం మండలం పేంటుపాడం వాస్తువ్యువలైన మృతురాలి తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచి వేసింది.
పంచనామ చేసిన పోలీసులు
ఇదిలా ఉండగా తేజస్విణి మృతదేహాన్ని రాత్రికి రాత్రే పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించాలని యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.పంచనామ లేకుండా మృతదేహాన్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. దీంతో మృతదేహాన్ని యథాస్థానంలో ఉంచారు. గురువారం పోలీసులు, తహసీల్దార్ అటువైపు రాలేదు. దీంతో కన్నడపరసంఘాలు, గ్రామస్తులు ఆందోళనకుదిగాయి. ఎస్ఐ, సిఐ, డీఎస్పీలు అక్కడకు చేరుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంచనామ చేశారు. అనంతరం తేజస్విణి మృతదేహాన్ని గంగావతి ఆస్పత్రికి తరలించారు. కాగా చిన్నారి మృతదేహం ఆస్పత్రిలోనే ఉంచారు.