ప్రాణాలు తీసిన నిద్రమత్తు
ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టిన టాటా మ్యాజిక్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు మృతి, మరో నలుగురికి గాయాలు
మంగళగిరి: డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపు తప్పి రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన పురిటి అప్పన్న, మూలాల శ్రీను, చింతలోల సింహాచలం, గోరా కన్నయ్య, కోటిపల్లి శాంతారావులు గుంటూరులో గొర్రెలమండికి వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో గురువారం రాత్రి బయల్దేరారు. మధ్యలో మరో యువకుడు వాహనం ఎక్కాడు. శుక్రవారం తెల్లవారుజామున మరో గంటలో గొర్రెలమండికి చేరుకోవాల్సి ఉండగా, జాతీయ రహదారిపై పక్కన ఆగి ఉన్న కంటైనర్ను వాహనం అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కోటిపల్లి శాంతారావు (22) గోరా కన్నయ్య(28)లు అక్కడికక్కడే మృతి చెందారు. మధ్యలో వాహనం ఎక్కిన గుర్తు తెలియని యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్రగాయాలపాలైన మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు క్షతగాత్రులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు