రైలులో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సికింద్రాబాద్: రైలుబోగీ బాత్రూంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మన్మాడ్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మన్మాడ్ ఎక్స్ప్రెస్ రైలు కామారెడ్డి చేరుకున్న అనంతరం జనరల్ బోగీలోని ఒక ప్రయాణికుడు బాత్రూంకు వెళ్లేందుకు ప్రయత్నించగా తలుపులు తెరుచుకోలేదు. గంటల తరబడి బాత్రూం డోర్ ఓపెన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన అతను కిటికీలోంచి చూడగా బాత్రూంలోని ట్యాప్ పైప్కు ఓ వ్యక్తి ఉరివేసుకుని కనిపించడంతో జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్న అనంతరం జీఆర్పీ పోలీసులు మృతదేహానికి స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద లభించిన ఏటీఎం కార్డు ఆధారంగా ఆరా తీయగా మృతుడు ఆల్వాల్ వెంకటాపురంలోని బ్యాంకు కాలనీకి చెందిన పి.శ్రీనివాస్రావు (40) గుర్తించారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కర్నూలుకు వెళ్లినందున పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా కుటుంబకలహాల కారణంగా శ్రీనివాస్రావు కొంతకాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.