కుప్పకూలిన ఆశయం
మినీ లారీ ఢీ : విద్యార్థి మృతి
విజయవాడలోని నిడమానూరు వద్ద ఘటన
నల్లపురెడ్డిపల్లెలో విషాదఛాయలు
కన్న కొడుకును ప్రయోజకుడిగా చూడాలనుకుంది. ఇంటి పెద్దదిక్కు చనిపోయినా వ్యవసాయ పనులు చేస్తూ కొడుకును విజయవాడలోని చెతన్య కళాశాలలో ఇంటర్ చదివిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సుదర్శన్రెడ్డి బయటకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మినీ లారీ వచ్చి ఢీకొంది. దీంతో అక్కడికక్కడే సుదర్శన్రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. దీంతో తల్లిపడిన శ్రమ, కన్న కలలు, ఆశయం కుప్పకూలాయి.
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : జాతీయ రహదారి వద్ద ఉన్న డివైడర్ దాటుతుండగా మినీ లారీ ఢీకొనడంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం నిడమానూరు రామన్ భవన్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కడప జిల్లా పులివెందులకు చెందిన తండూరి సుదర్శన్రెడ్డి (16) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పటమట ఎస్ఐ సత్యసుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం కాలేజీకి సెలవు కావడంతో బయటకు వెళ్లేందుకు సుదర్శన్రెడ్డి నిడమానూరు వద్ద జాతీయ రహదారి దాటుతున్నాడు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్న మినీ లారీ (ఏపీ 28 టీఈ 0659) ఢీకొట్టింది. దీంతో సుదర్శన్రెడ్డి అక్కడికక్కడే ప్రాణం వదిలాడు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఎస్ఐ పోస్టుమార్టం కోసం విజయవాడలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన మినీ లారీని పటమట పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సుదర్శన్రెడ్డి రామన్ భవన్ క్యాంపస్లోని చైతన్య కాలేజిలో చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు.
గ్రామంలో విషాదఛాయలు
పులివెందుల రూరల్: మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన తొండూరు సుబ్బారెడ్డి, సునీతలకు సుదర్శన్రెడ్డి, సురేంద్ర ఇద్దరు కుమారులు. తండ్రి సుబ్బారెడ్డి ఏడేళ్ల క్రితం పొలంలో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కుమారుల్లో పెద్దవాడు అయిన సుదర్శన్రెడ్డిని తల్లి సునీత విజయవాడలోని చైతన్య కళాశాలలో చేర్పించింది. కాగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుదర్శన్రెడ్డి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి.