దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ
టెన్త్ విద్యార్థే ఆదిత్యను హతమార్చాడు..
సాక్షి, అవనిగడ్డ : చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య(8) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. సోమవారం ఆదిత్యతో జరిగిన గొడవ కారణంగా పథకం ప్రకారం చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పెన్సిల్ చెక్కే బ్లేడ్తో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తన మాట వినడం లేదనే కోపంతో నిందితుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య
ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదో తరగతి విద్యార్థి సోమవారం రాత్రి ఆదిత్యను బాత్రూమ్కు తోడు తీసుకు వెళ్లి అనంతరం బ్లేడ్తో గొంతు కోశాడు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితుడు, ఆదిత్య కొన్నిరోజులు కలసి పడుకున్నారు. అయితే అతడి వికృత చేష్టలకు భయపడి ఆదిత్య అతడి దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక నిందితుడితో పాటు హాస్టల్ వార్డెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్మన్ నాగబాబుని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సస్పెండ్ చేశారు.