పరీక్షలను ఎదుర్కోలేక మానసిక ఒత్తిడితో..
సాక్షి, నర్సింహులపేట: కిరోసిన్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుర్ర శ్రీరాములు–రమ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సందీప్ 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు.
10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతుండగా పరీక్షలపై వారం రోజుల నుంచి మానసిక ఒత్తిడికి గురై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ కృష్ణ తెలిపారు.
సంబంధిత వార్తలు