మందలించారని ప్రాణం తీసుకున్నాడు

Student Commits Suicide In Guntur - Sakshi

గుంటూరు, రాజుపాలెం: పాఠశాలకు వెళ్లలేదని తల్లిదండ్రులు కుమారుడిని మందలించడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఓర్సు సుబ్బారావు, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన ఓర్సు మహేష్‌(12) అదే గ్రామంలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వినాయక చవితి పండుగ నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మహేష్‌ను గురువారం ఉదయం మందలించారు.

అనంతరం తల్లిదండ్రులు ఇద్దరూ రోజూలాగానే పేరేచర్ల వద్ద గల క్రషర్‌ మిల్లు పనులకు వెళ్లారు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన మహేష్‌  ఇంటిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. పనులకు వెళ్లిన తండ్రి సుబ్బారావుదగ్గర బంధువుకు 3 గంటల సమయంలో  ఫోన్‌ చేసి అబ్బాయి బడికి వెళ్లాడా, ఎలా ఉన్నాడు అని వాకబు చేయమన్నాడు. బంధువు ఇంటికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడని తెలిపారు.  తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకొని విగతజీవుడైన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న తప్పునకు ఎంత శిక్ష వేశావయ్యా అని కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పి.రమేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top