తండ్రిని కడతేర్చిన తనయుడు
తమిళనాడు, అన్నానగర్: గదిలో నిర్భందించాడనే ఆవేశంలో ఓ యువకుడు కన్న తండ్రినే కడతేర్చాడు. దిండుక్కల్ జిల్లా గుడిలియమ్పారై భగవతియమ్మన్ ఆలయ వీధికి చెందిన సెల్వరాజ్(50) బిర్యాని దుకాణం నడుపుతుంటాడు. ఇతనికి భార్య మహాలక్ష్మి(45), కుమారుడు వినోద్కుమార్(26), కుమార్తె అభిరామి ఉన్నారు. కుమార్తెకి వివాహమయ్యి నాగర్కోవిల్లో కాపురం ఉంటోంది. కుమారుడు వినోద్కి ఇంకా వివాహం కాలేదు. ఇతను ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వినోద్కుమార్ గత కొన్ని నెలలుగా మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 7వ తేదీ గుజిలియమ్పారైలో జరిగిన కాళియమ్మన్ ఆలయ వేడుకలో వినోద్కుమార్కు అదే ప్రాంతానికి చెందిన కొంత మందితో గొడవ జరిగింది. ఈ గొడవలో వారు వినోద్కుమార్పై దాడి చేశారు. దీంతో వారిపై పగ పెంచుకున్న అతను తనపై దాడి చేసిన వారిపై తిరిగి దాడి చేయాలని తన తల్లిదండ్రుల వద్ద చెప్తుండేవాడు.
ఆదివారం రోజు మద్యం మత్తులో ఉన్న వినోద్కుమార్ ఆ వీధిలో ఉన్నవారితో తగాదా పెట్టుకున్నాడు. ఇది చూసిన అతని తల్లిదండ్రులు వినోద్ కుమార్ని ఇంటికి పిలుచుకుని వచ్చి ఒక గదిలో పెట్టి నిర్భంధించారు. కొద్ది సేపటి తర్వాత అతను తలుపు తాళాలు బద్దలుగొట్టుకుని బయటకి వచ్చాడు. బయటపడ్డ తర్వాత ఇంట్లో ఉన్న కత్తెరతో తల్లి మహాలక్ష్మిని పొడిచాడు. దీన్ని చూసిన సెల్వరాజ్ కుమారున్ని అడ్డుకోవటానికి యత్నించడంతో వినోద్కుమార్ తండ్రిపై దాడికి తెగబడ్డాడు. దీంతో సెల్వరాజ్ ఇంటి నుండి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతనిని వదలకుండ వెంబడించిన వినోద్కుమార్ అక్కడ ఉన్న రోకలితో సెల్వరాజ్ని దాడి చేశాడు. అప్పటికీ ఆవేశం తీరని వినోద్కుమార్ రోకలితో సెల్వరాజ్ తలపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన సెల్వరాజ్ సంఘటనాస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వేడచందూర్ పోలీసు జాయింట్ సూపరింటెండెంట్ శివకుమార్, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తీవ్రగాయాలతో పోరాడుతున్న మహాలక్ష్మిని రక్షించి దిండుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వినోద్కుమార్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.