యువకుడిని కిడ్నాప్ చేసిన సాఫ్ట్వేర్ యువతి
సాక్షి, హైదరాబాద్: ప్రతిరోజూ ఫోన్ చేసి వేధిస్తున్నాడనే కోపంతో యువకుడిని కిడ్నాప్ చేసిందో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అతన్ని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితుల సహాయంతో చితకబాదింది. ఈ సంఘటన గురువారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దివ్య అనే యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోంది. గత కొద్దికాలంగా ఆమెను ఓ యువకుడు ఫోన్ చేసి వేధించసాగాడు. ఈ నేపథ్యంలో వేధింపులు తాళలేక అతనికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది.
స్నేహితుల సహాయంతో అతన్ని కిడ్నాప్ చేయాలని నిశ్చయించుకుంది. అతడికి ఫోన్ చేసి సికింద్రాబాద్కు రమ్మనడంతో రెక్కలు కట్టుకువాలిపోయాడు. యువకుడిని ఎవరూలేని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితుల సహాయంతో చితకబాదింది. ఆ యువకుడి కిడ్నాప్ కేసును పోలీసులు గంటలోపే చేధించారు. దివ్యతో పాటు ఆమెకు సహకరించిన స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్, హత్యాయత్నం సెక్షన్ల కింద యువతిపై కేసు నమోదు చేశారు.