ఏసీబీ వలలో సింగరేణి ఏఈ
రూ. లక్ష లంచం తీసుకుంటూ..
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఏరియాలో సివిల్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న ఎం.రాజశేఖర్ రూ.లక్ష లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సింగరేణిలో సివిల్ కాంట్రాక్టర్గా పనులు చేస్తున్న శివవంశీ కిషోర్(లైసెన్స్డ్ కాంట్రాక్టర్) తండ్రి సారంగరావు ఓసీ–4 జంక్షన్ నుంచి కేసీహెచ్పీ వరకు 1.6 కిలోమీటర్ల రోడ్డు పనులు చేశారు. దీనికి రూ.3.22 కోట్లు నిధులు మంజూరయ్యాయి. సింగరేణి వీటిని 7 భాగాలుగా విభజించి బిల్లులు చెల్లిస్తోంది. అయితే, చివరి బిల్లు రూ.25 లక్షలు చెల్లింపునకు.. ఎంబీ రికార్డు చేయాల్సి ఉండగా, రాజశేఖర్ రూ. లక్ష డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఖమ్మం ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం సదరు ఏఈకి కాంట్రాక్టర్ లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేశారు.