యువకులను చితకబాదిన ఎస్ఐ
ఎస్పీ, ఎమ్మెల్యేలకు బాధితుల ఫిర్యాదు
రాజంపేట(కామారెడ్డి) : మండల కేంద్రంలోని వైన్ షాపు వద్ద గురువారం రాత్రి జరిగిన సంఘటనలో ఎస్ఐ రవిగౌడ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అకారణంగా తమను కొట్టాడంటూ కొండాపూర్ గ్రామానికి చెందిన యువకులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ఎస్పీ శ్వేత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణకు కామారెడ్డి రూరల్ సీఐ భిక్షపతిని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది.
రాజంపేటలోని వైన్స్ వద్దకు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మండలంలోని కొండాపూర్కు చెందిన యువకులు కొం దరు మద్యం కోసం వచ్చారు. అదే సమయంలో ఎస్ఐ రవిగౌడ్ సిబ్బందితో అక్కడకి వచ్చారు. అక్కడున్న తమపై ఎస్ఐ దాడి చేశాడని కొండాపూర్కు చెందిన యువకులు శివాగౌడ్, శ్రీనివాస్గౌడ్ చెబుతున్నారు. విషయం తెలుసుకుని కొందరు కొండాపూర్ గ్రామస్తులు, ఉపసర్పంచ్ బాల్రాజ్ అక్కడికి చేరుకున్నారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది వరకు జరిగిన సంఘ టనల విషయంలో కొండాపూర్ యువకులపై ఎస్ఐ కక్ష్య పెంచుకుని ఉద్దేశ పూర్వకంగానే కొట్టాడని వారు ఆరోపించారు. ఈ విషయమై ఎస్ఐని వివరణ కోరగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారని తమకు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లామన్నారు. దీంతో వారిని మందలించామన్నారు. తన తప్పేమి లేదన్నారు. ఈ విషయంపై శుక్రవారం ఉదయం కొండాపూర్ గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు కామారెడ్డికి వచ్చారు.
ఎస్పీ శ్వేత నిజామాబాద్ వెళ్లడంతో ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు యువకులు తెలిపారు. తర్వాత కలెక్టరేట్కు వెళ్లారు. అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిలకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అకారణంగా తమను కొట్టాడని వారి దృష్టికి తీసుకువెళ్లారు.