రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ ఉద్యోగి మృతి

Sakshi TV Employee Died in Road Accident

కీసర: రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీలో పనిచేసే యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం కీసర పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలోని  చీర్యాల ఓట్టాగు సమీపంలో జరిగింది.  కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపిన మేరకు..  భోగారం గ్రామానికి చెందిన  చుంచు రాహుల్‌(21) నగరంలోని ఇందిరా టెలివిజన్‌(సాక్షి టీవీ)లో ఈవెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి  కార్యాలయంలో విధులు ముగించుకొని నగరంలో ఉన్న తన మిత్రుల వద్దకు వెళ్లాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో  బైక్‌పై భోగారంలోని తమ  ఇంటికి తిరిగి వస్తుండగా  చీర్యాల ఓట్టాగు వద్దకు వాహనం అదుపు తప్పి రోడ్డుడివైడర్‌ను ఢీకొంది. దీంతో  తలకు , మెడ వద్ద,  తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108  సిబ్బంది  రాహుల్‌ను చికిత్స నిమిత్తం నగరంలోని యశోద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు  దర్యాప్తు చేస్తున్నారు.  గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే  రాహుల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడన్న విషయాన్ని తెలుసుకున్న  గ్రామస్తులు ,  మిత్రులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. జడ్‌పీ వైస్‌ చైర్మెన్‌ వెంకటేష్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మూడు చింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి తదితర నాయకులు నివాళులర్పించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top