తప్పిన పెను ప్రమాదం
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
పలువురికి తీవ్ర గాయాలు
జిల్లా ఆస్పత్రికి తరలింపు
సిద్దిపేట అర్బన్: ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణీకుల్లో కొందరు తీవ్ర, స్వల్ప గాయాలతో బయట పడడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సిద్దిపేట పట్టణ శివారులోని రంగీలా చౌరస్తా వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 55మంది ప్రయాణీకులతో సికింద్రాబాద్ వైపుకు వెళ్తోంది. ఈ క్రమంలో రంగీలా చౌరస్తాలో సిద్దిపేట వైపుకు మల్లే సమయంలో హైదారాబాద్ వైపు నుంచి కరీంనగర్ వైపుకు వెళ్లే ఇసుక లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్, కండక్టర్తో పాటు మరో నలుగురైదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని క్షతగాత్రుల్లో కరీంనగర్కు చెందిన పోచయ్య, స్వరూపా, కృష్ణవేణి, సంతోష్, రజియా, వనజా, పర్శరాములు, శ్రీనివాస్లతో పాటు సుమారుగా 35మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సభ ముగిసిన కొద్ది సేపటికే ఘటన జరగడంతో.. సమీపంలో ఉన్న టూటౌన్ ఎస్ఐ శ్రీనివాస్రెడ్డితో పాటు అతని వాహన డ్రైవర్ నాగరాజులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు దగ్గరుండి బస్సుల్లోని క్షతగాత్రులను బయటకు తీశారు. 108 అంబులెన్స్లలో పాటు పోలీసు వాహనం క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
డేంజర్ చౌరస్తా ‘రంగీలా’..
రంగీలా ప్రమాదల చౌరస్తాగా మారుతోంది. అక్కడ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నా పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించడం లేదు. ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలని పలువురు విన్నవించుకున్న సందర్భాలున్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాల చౌరస్తాగా మారుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకున్న ఘటనలో పలువురు గాయాలై పెను ప్రమాదం నుంచి బయపడ్డారు. మరో ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోలి.