టీచర్స్ కాలనీలో చోరీ
పది తులాల బంగారం, రూ.22 వేల నగదు అపహరణ
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ఆదిలాబాద్రూరల్ : పట్టణ సమీపంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీకి చెందిన రైతు వెంకట్రెడ్డి ఇంట్లో శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య చోరీ జరిగింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ నర్సింహారెడ్డి, రూరల్ సీఐ ప్రదీప్కుమార్, మావల ఎస్సై అనిల్ పరిశీలించారు. బాధితుడి కథనం మేరకు 7:50 గంటలకు ఇంట్లో నుంచి పట్టణానికి వెళ్లి, 8:50 గంటల వరకు ఇంటికి తిరిగి వచ్చేలోగా తాళం తీసి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా పది తులాల బంగారం, రూ.22 వేల నగదు, ఐదు తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.